తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించి లోకేశ్‌ తన పాదయాత్ర ముగించారు.

యువగళం సైనికులకు కృతజ్ఞతాభినందనలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) తెలిపారు. చారిత్రాత్మకమైన యువగళం క్రతువులో భాగస్వాములైన ప్రధాన సమన్వయకర్త కిలారి రాజేష్, వివిధ కమిటీల సమన్వయకర్తలు, సభ్యులకు కృతజ్ఞతాభినందనలు చెప్పారు. సోమవారం నాడు యువగళం పాదయాత్ర సందర్భంగా మాట్లాడుతూ…‘‘ఏపీలో జగన్మోహన్‌రెడ్డి అరాచకపాలనపై ప్రజాచైతన్యమే లక్ష్యంగా ఈ ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం వరదరాజస్వామి ఆలయం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. 226రోజులు, 3132 కి.మీ.ల మేర అవిశ్రాంతంగా కొనసాగి విశాఖ జిల్లా అగనంపూడి వద్ద దిగ్విజయంగా పూర్తయింది. ఈ సుదీర్ఘమైన మజిలీలో యువగళం పవిత్ర యజ్ఞాన్ని ముందుకు నడిపించడంలో యువగళం కమిటీల పాత్ర అనిర్వచనీయం. అధికార పార్టీ సైకోలు ఎన్నో కవ్వింపు చర్యలకు పాల్పడినా సంయమనతో లక్ష్యాన్ని చేరుకునేందుకు సహకరించారు. యాత్ర కొనసాగుతున్న సమయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రేయింబవళ్లు నా వెన్నంటే ఉంటూ సేవలందించారు. దాదాపు ఏడాదిపాటు కుటుంబాలకు దూరంగా మీరు అందించిన సేవలు జీవితంలో మరువలేను. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ సాధించబోయే అప్రతిహతమైన విజయాలకు మన యువగళం పునాది వేసింది. మరో 3నెలల్లో చంద్రన్న నేతృత్వాన ఏర్పాటయ్యే ప్రజాప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.